'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్లో కులగణన సర్వేపై అఫిడవిట్ను ఉపసంహరించుకున్న కేంద్రం
బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను కేంద్రం ఉపసంహరించుకుంది. బిహార్ సర్కార్ కుల గణన సర్వేకు వ్యతిరేకంగా కేంద్రం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో జనాభా గణనను నిర్వహించే పూర్తి హక్కు కేంద్రానికి ఉంటుందని కేంద్రం పేర్కొంది. అయితే కొన్ని గంటల తర్వాత కేంద్రం తన వైఖరిని సవరించింది. అనుకోకుండా పొరపాటు జరిగిందని పేర్కొంటూ, రాజ్యాంగం ప్రకారం సంస్థలకు జనాభా గణన లేదా ఇతర సర్వేలు చేయడానికి అర్హత లేదన్న వ్యాఖ్యాన్ని అఫిడవిట్లో కేంద్రం తొలగించింది. ఆ తర్వాత సవరించిన అఫిడవిట్ను కేంద్రం మరోసారి సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.
బిహార్లో కుల గణన సర్వేకు గణనీయమైన మద్దతు
బిహార్లో కుల గణన సర్వేకు గణనీయమైన ప్రజా మద్దతు లభిస్తోంది. అందుకే కుల ఆధారిత సర్వేను వ్యతిరేకించేందుకు కేంద్రం వెనకడుగు వేస్తోంది. అలాగే మొదటిసారి అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేను కేంద్రం వ్యతిరేకించడం లేదు, అలాగని మద్దతు కూడా ఇవ్వడం లేదని చెప్పడం గమనార్హం. 1948 జనాభా లెక్కల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జనాభా గణనను నిర్వహించడానికి కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని రెండోసారి దాఖలు చేసిన అఫిడవిట్లో తుషార్ మెహతా పేర్కొన్నారు. సర్వేకు సంబంధించి కేంద్రం తన వైఖరిని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్చుకుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.