మేం అంటరానివాళ్లమా.. ఇండియా కూటమిపై AIMIM సంచలన వ్యాఖ్యలు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కూటమిపై ఇప్పటికే స్పందించిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి పాలక, విపక్ష నేతల తీరుపై మండిపడ్డారు. తాజాగా విపక్ష నేతల మీటింగ్ కు తమను ఆహ్వానించకపోవడాన్ని AIMIM పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు 26 పార్టీల కూటమిపై మజ్లిస్ నేత వారిస్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము రాజకీయంగా అంటరాని వాళ్లమా అంటూ జాతీయ అధికార ప్రతినిధి పఠాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీకి తమను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయ కూటములకు ముస్లిం రాజకీయ నేతలు రాకూడదా అంటూ ఫైర్ అయ్యారు.
ఉద్ధవ్ థాక్రే, నితీశ్ కుమార్, మెహబూబా ముఫ్తీ లౌకికవాదులయ్యారా : AIMIM
విపక్ష రాజకీయ పార్టీలకు కేవలం ముస్లిం ఓట్లు ఉంటే సరిపోతుందా అని వారిస్ పఠాన్ ప్రశ్నించారు. విపక్ష నేతల్లో ఉద్ధవ్ థాక్రే, నితీశ్ కుమార్, మెహబూబా ముఫ్తీ నిన్న మొన్నటి వరకు బీజేపీతోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు వారంతా లౌకికవాదులుగా మారిపోయారా అంటూ నిప్పులు చెరిగారు. మరోవైపు విపక్షాల తొలి భేటీ తర్వాత కాంగ్రెస్పై ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. అంతకుముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీపై మండిపడ్డారు. కానీ తాజాగా బెంగళూరు సమావేశానికి ఆయనకు సైతం ఆహ్వానం అందింది. 2024లో బీజేపీని గద్దె దించేందుకు పోరాడుతున్న AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీని మాత్రం పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.