బీజేపీ,కాంగ్రెస్ దొందు దొందే.. అందుకే ఇండియా కూటమిలో చేరలేదన్న మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయవతి కాంగ్రెస్, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. విపక్ష పార్టీలన్నీ కలిసి బెంగళూరు వేదికగా ఇటీవలే ఇండియాగా కూటమి కట్టిన సందర్భంగా మాయావతి స్పందించారు. ఇటు కేంద్రంలోని బీజేపీ కానీ అటు విపక్షలు కానీ ప్రజా సంక్షేమం కోసం పనిచేయట్లేదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోందని ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కులతత్వ, పెట్టుబడిదారి పార్టీలతో హస్తం జతకట్టిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆ పార్టీ వెంపర్లాడుతోందన్నారు.ఓ వైపు బీజేపీ ఎన్డీఏ బలోపేతంపై దృష్టి సారించిందన్న మాయావతి, ఈ రెండు పార్టీలు దళిత, ముస్లిం వ్యతిరేకులేనన్నారు.
4 రాష్ట్రాల ఎన్నికల బరిలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది : మాయావతి
దళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం ఇప్పటి వరకు ఈ పార్టీలేమీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికార, విపక్ష పార్టీలన్నీ ఒక్కటేనని, తీరా గద్దెనెక్కాక ఇచ్చిన వాగ్ధానాలను మర్చిపోతారని ఆమె చురకలు అంటించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ రెండింటి విధానాలు ఒక్కటేనన్నారు. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలతో తాము చేతులు కలపలేదని మాయావతి వెల్లడించారు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సారూప్య భావాలు కలిగిన కుల, పెట్టుబడిదారీ పార్టీలతోనే పొత్తుకు ఒడిగడుతోందన్నారు. ఈ క్రమంలోనే వచ్చే నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల బరిలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.