
DGCA: ఎయిరిండియా ఘోర ప్రమాదం.. సీనియర్ అధికారులను తొలగించిన డీజీసీఏ
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని అహ్మదాబాద్ (Ahmadabad) నుంచి లండన్ వెళ్లే మార్గంలో ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఇటీవల కుప్పకూలి మంటల్లో దగ్ధమైన ఘటన దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించాలని డీజీసీఏ ఆదేశించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, తొలగించిన అధికారులు ఎయిరిండియాలో సిబ్బంది షెడ్యూళ్లు, రోస్టర్ వంటి పనులను పర్యవేక్షిస్తుండేవారు.
Details
272 మంది మృతి
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ విమానం సాంకేతిక సమస్యలకు లోనై ఒక భవనంపై కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానం కూలిన ప్రమాదంలో 241 మంది మరణించగా, విమానం కూలిన స్థలంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, కొంతమంది స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ఈ ఘోర ప్రమాదంలో 272 మంది మృత్యువాత పడ్డారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈపరిణామాల నేపథ్యంలో డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకుని, సంబంధిత ముగ్గురు అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.