
Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. దర్యాప్తు అధికారికి 'ఎక్స్' కేటగిరీ భద్రత
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్లో జరిగిన దిగ్భ్రాంతికర ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణను ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్కు ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా సంస్థల సమాచారం. దీనితో ఆయనకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, జూన్ 16 నుంచే యుగంధర్కు 'ఎక్స్' కేటగిరీ భద్రత అమలులోకి వచ్చింది. ఈ భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది.
Details
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ఏఏఐబీ
ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. వీరిలో కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విమానం అక్కడి మెడికల్ కాలేజీ హాస్టల్పై పడటంతో మరికొంతమంది అక్కడే మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 270కు పైగా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఘటన అనంతరం వెంటనే ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. యుగంధర్ నేతృత్వంలో నిపుణుల బృందం - ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్ మెడిసిన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సభ్యులు ఈదర్యాప్తులో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గురైన విమానంలోని బ్లాక్బాక్స్లు ఏఏఐబీ ల్యాబ్కు తరలించబడ్డాయి. అందులోని డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసి దుర్ఘటనకు గల కారణాలను విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం.