Amaravati: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హామీ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టగా, ఎంపీ రేణుకా చౌదరి చర్చను ప్రారంభించారు. చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది.
వివరాలు
10 పార్టీలకు చెందిన సభ్యులు బిల్లుకు మద్దతు
రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతిపై శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. మొత్తం 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు చర్చలో పాల్గొనగా, వాటిలో 10 పార్టీలకు చెందిన సభ్యులు బిల్లుకు మద్దతు తెలిపారు.