ఖరారైన తెలంగాణ అమిత్ షా పర్యటన.. టూర్ వివరాలు ఇవే
ఈనెల 27న తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ 'రైతు గోస - బిజెపి భరోసా' సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అంతకముందు రెండు సార్లు అమిత్ షా ఖమ్మం పర్యటనకు వస్తారని అనుకున్నా.. అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 27న అమిత్ షా ఖమ్మం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం బహిరంగ సభ వేదికగా అమిత్ షా ఏమి మాట్లాడతారో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఖమ్మం పర్యటన వివరాలు
ఢిల్లీ నుంచి అమిత్ షా ప్రత్యేక విమానంలో ఆదివారం (ఆగస్టు 27) ఉదయం 11గంటలకు ఖమ్మం బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.25 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెలికాప్టర్లో భద్రాచలం హెలిప్యాడ్ కు 2.10గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.55 నుంచి 2.40 గంటల మధ్య భద్రాచలం ఆలయంలో సీతారాములను దర్శించుకొని అక్కడి నుండి 2.55 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 3.40కు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 నుంచి 4.35 గంటల వరకు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.
ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి అమిత్ షా
అనంతరం సాయంత్రం 4.40 గంటల నుండి 5.30 వరకు పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 6.20 కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్తారు.