చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్అకాడమీ
చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ప్రముఖ ఆన్లైన్ విద్యావేదిక అన్అకాడమీ ఉపాధ్యాయుడిని తొలగించడం వివాదాస్పదమైంది. కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ లో ఉద్యోగం పోగొట్టుకున్న ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కరణ్ స్పందించారు. అందులో తానూ వివాదానికి కేంద్రంగా ఉన్నట్లు ఆయన అన్నారు. జ్యుడీషియల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న తన స్టూడెంట్లు కూడా ఈ కాంట్రవర్సీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా తన పైనా ప్రతికూల ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరణ్ తన విద్యార్థులకు పాఠం చెప్పే సందర్భంగా చదువుకున్న వారికే ఓటేయాలని సూచించే వీడియో వివాదాస్పదంగా మారింది.
అన్అకాడమీ ఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
కరణ్ తొలగింపుపై అన్అకాడమీ వ్యవస్థాపకుడు, రోమన్ శైనీ సోషల్ మీడియా 'ఎక్స్' ద్వారా స్పందించారు. కరణ్ సంగ్వాన్ క్లాస్ రూం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించేందుకు తరగతి గది వేదిక చేసుకున్నారని అన్నారు. నాణ్యమైన విద్య అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. చదువుకున్న వారికి ఓటేయాలని చెప్పడం నేరమా? అలాగని చదువురాని వారిపై తనకు గౌరవం ఉందని అలాగని ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు వారు అనర్హులు అన్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చదువురాని నాయకులు ఎవరు కూడా నవ భారత్ను నిర్మించలేరంటూ ట్వీట్ చేశారు.