
Ankita Bhandari Case: అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష!
ఈ వార్తాకథనం ఏంటి
2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసులో చివరకు న్యాయం జరిగింది.
ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఉత్తరాఖండ్లోని ఒక స్థానిక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.
హోటల్లో రిసెప్షనిస్ట్గా పని చేస్తున్న అంకిత భండారి హత్య కేసుపై దేశమంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా కోర్టు తీర్పుతో ఆ బాధిత కుటుంబానికి న్యాయ పరంగా ఊరట లభించింది.
ఈ దారుణ ఘటనలో బీజేపీ మాజీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, మరో ఉద్యోగి అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.
వారు ముగ్గురూ అంకితను ప్రణాళికాబద్ధంగా హత్య చేసినట్టు తేల్చి, వారిపై యావజ్జీవ శిక్ష విధించింది.
వివరాలు
కాలువలోకి తోసి హత్య
అంకిత భండారి, పౌరి జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఉద్యోగినిగా పని చేస్తోంది.
అదే రిసార్ట్ ఓనరైన పుల్కిత్ ఆర్య లైంగిక వేధింపులకు గురి చేసి,ఆమె తిరస్కరించడంతో,ఆమె పై కోపం పెంచుకొని హత్య చేశాడు.
ఆమెను తమ వాహనంలో తీసుకెళ్లి, మద్యం సేవించిన తర్వాత, లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించగా అంకిత వ్యతిరేకించడంతో నిందితులు ఆమెను కాలువలోకి తోసి హత్య చేశారు.
ఈ సంఘటన 2022 సెప్టెంబర్ 18న చోటుచేసుకుంది.అదే రోజున అంకిత గల్లంతైనట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.
ఆ రాత్రి సుమారు 8గంటల సమయంలో ఆమె నిందితులైన ముగ్గురితో కలిసి రిషికేశ్ వెళ్లింది.
తిరిగివస్తూ చిలా రోడ్డులోని ఒక కాలువ దగ్గర వాహనం ఆపిన వారు,అక్కడే ఆమెను హత్య చేశారు.
వివరాలు
దర్యాప్తులో మొత్తం 97 మందిని సాక్షులుగా గుర్తించారు
ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఆరంభ దశలో దర్యాప్తులో జాప్యం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
దర్యాప్తులో మొత్తం 97 మందిని సాక్షులుగా గుర్తించారు. అయితే ఈ జాబితాలోని 47 మందిని మార్చి 28, 2023న తొలగించారు.
తుదకు కోర్టు విచారణలో అన్ని ఆధారాలు పరిశీలించిన అనంతరం ముగ్గురు నిందితులపై యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది.
ఈ తీర్పుతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అంకిత కుటుంబానికి కొంతవరకు న్యాయ పరంగా న్యాయం జరిగినట్లు భావించవచ్చు.