
AP Weather: ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. మూడ్రోజుల పాటు వర్షాల హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. వారి వివరాల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఆగస్టు 25 నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే ఆగస్టు 23 శనివారం గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం అదే చోట కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి, పైకి వెళ్ళేకొద్దీ నైరుతి దిశగా వంగి కనిపిస్తున్నదని అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఇది జార్ఖండ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Details
గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం
దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నైరుతి-పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అంతేకాకుండా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు స్పష్టం చేశారు.