Nadendla Manohar: ఏపీలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు: నాదెండ్ల మనోహర్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రెండో రోజు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపారు. తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించేందుకు ఈ విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వివరాలు
సైనిక శిబిరాల్లో అరకు కాఫీ విక్రయాలు
వీటి ద్వారా సిరిధాన్యాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మార్కెట్లో ఉన్న ధరల కంటే తక్కువకు నాణ్యమైన సరుకులను అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక అరకు కాఫీకి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని సైనిక శిబిరాల్లో అరకు కాఫీ విక్రయాలు జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపినట్లు ఆయన వివరించారు.