Railway Zone : ఏపీ సర్కారుపై రైల్వేశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. రైల్వేజోన్ కోసం భూమివ్వలేదన్న అశ్వినీ వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
దక్షిణకోస్తా రైల్వేజోన్ను అధికారికంగా ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయా, జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మాణం ఎప్పట్నుంచి ప్రారంభమవుతుంది,నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది,నిర్మాణం పూర్తి చేసేందుకు ఎన్నిరోజులు గడువు పొడిగించారు,ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు,ఎంత ఉపయోగించారు తదితర ప్రశ్నలను తెలుగుదేశం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు బుధవారం లోక్సభలో అడిగారు.
దీంతో ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని రైల్వేశాఖ మంత్రి సమాధానాలు ఇచ్చారు.
details
దక్షిణ కోస్తా రైల్వేజోన్కు డీపీఆర్ సిద్ధం
'దక్షిణ కోస్తా రైల్వేజోన్కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (DPR) తయారైనట్లు మంత్రి చెప్పారు.
రూ.106.89 కోట్ల అంచనా వ్యయంతో జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరు చేశామన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.10 కోట్లు కేటాయించామన్నారు. భూసర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పుకోస్తా రైల్వేజోన్కు అప్పగించామన్నారు.
ముడసర్లోవలోని 52.2 ఎకరాల భూమిలో ఈ జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించాలని డీపీఆర్లో ప్రతిపాదించామని మంత్రి పేర్కొన్నారు.
DETAILS
రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది : అశ్వినీ వైష్ణవ్
మరోవైపు Bus Rapid Transit System (Brts) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకుందని, దానికి బదులుగా ముడసర్లోవలో 52.2 ఎకరాల భూమిని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సి ఉందన్నారు.
ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించలేదని, ఈ మేరకు భూమిని రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
ఇదే సమయంలో విశాఖపట్నం జంక్షన్ - గోపాలపట్నం మధ్య 15.31 కిలోమీటర్ల మేర రూ.159.47 కోట్లతో 3, 4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్లో అనుమతులు మంజూరు చేశామని రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు.