150దేశాల్లోని ఆపిల్ ఫోన్లకు ఇలాంటి మేసేజ్లు వచ్చాయ్: ప్రతిపక్ష ఎంపీల ఫోన్ల హ్యాకింగ్పై స్పందించిన కేంద్రం
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, శివసేన (యూబీటీ) ప్రియాంక చతుర్వేది, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తమ ఫోన్లు ఆపిల్ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. విపక్షాలు లేవనెత్తిన ఫోన్ హ్యాకింగ్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆపిల్ 150 దేశాల పౌరులకు ఇలాంటి హెచ్చరిక మెసేజ్లను పంపినట్లు, ఈ సందేశంపై వివరణాత్మక దర్యాప్తుకు ఆదేశించామని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని తాను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాని వివరించారు. ఇదిలా ఉంటే, ఆపిల్ యాజమాన్యం.. తమ ఫోన్లను ఎవరూ హ్యాక్ చేయలేరని గతంలోనే తేల్చి చెప్పింది.
ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫైర్
విపక్షాలు లేవనెత్తిన ఫోన్ హ్యాకింగ్ వివాదంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మండిపడ్డారు. దేశంలో విమర్శించడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. కొందరు మోదీ ఆధర్వంలో జరుగుతున్న దేశ ప్రగతిని జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఎందుకంటే, ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి గురించి మాత్రమే ఆలోచించారన్నారు. వారు డబ్బులను కూడబెట్టుకోవడం గురించే ఆలోచించారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీలకు వచ్చిన మెసేజ్లపై ఆపిల్ సంస్థ స్పందించింది. ఆపిల్ సంస్థ అలర్ట్ మెసేజ్లను జారీ చేయదని పేర్కొంది. ప్రతిపక్ష ఎంపీలకు వచ్చిన నోటిఫికేషన్లు నకిలీవి కావొచ్చని ఆపిల్ స్పష్టం చేసింది. హ్యాకింగ్ పద్దతులు మారుతున్న నేపథ్యంలో దీనిపై ఇప్పుడే మేము ఏం చెప్పలేమని వెల్లడించింది.