Arvind Kejriwal: ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే!
మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోషన్ను ప్రవేశపెడుతున్నప్పుడు, ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని ప్రజలకు చూపించాలనుకుంటున్నట్లు కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం మనం చూస్తున్నాం. మద్యం పాలసీ కేసు సాకుతో నాయకులను అరెస్ట్ చేయాలని వారు భావిస్తున్నారు. మా ఎమ్యెల్యేలు ఎవరూ విడిపోలేదని చెక్కుచెదరలేదని ప్రజలకు చూపించేందుకు నేను విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాను" అని తెలిపారు.
ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25 కోట్లు ఆఫర్
ఢిల్లీ ఎన్నికల్లో తాము ఎప్పటికీ గెలవలేమని వారికి తెలుసు కాబట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.తన ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన వారాల తర్వాత కేజ్రీవాల్ ఈ చర్య తీసుకున్నారు. పార్టీ మారేందుకు ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని ఆయన పేర్కొన్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఆయనను త్వరలో అరెస్ట్ చేస్తామని కూడా బీజేపీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. అయన వాదనను అనుసరించి,ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఆరోపణలపై విచారణకు హాజరు అవ్వాలని అరవింద్ కేజ్రీవాల్కు నోటీసు పంపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆరోసారి సమన్లు
తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని పోలీసులు కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను కొనుగోలుకు సంప్రదించిన వారి పేర్లను కూడా చెప్పాలని నోటీసులో ముఖ్యమంత్రిని కోరారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరు కావడానికి ఒక రోజు ముందు కేజ్రీవాల్ మోషన్ను ముందుకు తెస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, ఈ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సోమవారం తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆరోసారి సమన్లు పంపింది. ప్రతిసారి సీఎం విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కక్ష సాధింపు చర్యగా ఆప్ పేర్కొంటోంది