యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు. వ్యూహాత్మక వైమానిక స్థావరం అయిన అసోంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించేందుకు ఆమె యాంటీ గ్రావిటీ సూట్ ధరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫైటర్ జెట్లో ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బ్రహ్మపుత్ర, తేజ్పూర్ లోయల మీదు సుమారు 30 నిమిషాల పాటు రాష్ట్రంలో విమానంలో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్లో ప్రయాణం అనంతరం రాష్ట్రపతి మీడియాతో మాట్లాడారు. ప్రయాణం చాలా బాగుందని, మంచి అనుభూతిని ఇచ్చినట్లు ప్రకటించారు.
యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడో రాష్ట్రపతి ముర్ము
మూడు రోజుల అసోం పర్యటనలో ఉన్న ముర్ము శనివారం గౌహతి నుంచి తేజ్పూర్ చేరుకున్నారు. ఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆమెకు స్వాగతం పలికారు. తేజ్పూర్లో దిగిన తర్వాత ముర్ము ఐఏఎఫ్ సిబ్బందితో గౌరవ గౌరవాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సుఖోయ్ ఫైటర్ జెట్ గురించి ఆమెకు అధికారిక బ్రీఫింగ్ జరిగింది. అనంతరం రాష్ట్రపతి ప్రయాణించారు. ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించిన మూడో రాష్ట్రపతి ముర్ము కావడం గమనార్హం. అంతకుముందు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ ఫ్రంట్లైన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించారు.