Page Loader
అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!
కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా మారిన లింగాయత్‌ సామాజిక వర్గం

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!

వ్రాసిన వారు Stalin
Mar 19, 2023
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. రాష్ట్రంలో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా లింగాయత్‌ల అంశం కీలకంగా మారుతోంది. కర్ణాటకలో రెండు దశాబ్దాలుగా లింగాయత్‌ల అండతోనే బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. కర్ణాటక జనాభాలో కర్ణాటకలో 17 శాతం లింగాయత్‌ల సమాజికవర్గమే ఉంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో కనీసం 154 స్థానాల్లో లింగాయత్‌ల ఉనికిని ఉంది. దాదాపు మెజార్టీ స్థానాల్లో వారే గెలుపోటములను శాసిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9మంది లింగాయత్‌లు ముఖ్యమంత్రులుగా పని చేశారంటే, ఆ సామాజిక వర్గం రాష్ట్రంలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక

రాజీవ్ గాంధీ ప్రకటనతో కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మళ్లిన లింగాయత్‌లు

వాస్తవానికి లింగాయత్‌లు మొదటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతుదారులుగా ఉన్నారు. డి.దేవరాజ్ ఉర్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసంస్కరణలు వల్ల భూస్వామ్య వర్గాలైన లింగాయత్‌లను ఆ పార్టీకి దూరం చేశాయి. 1983ఎన్నికల్లో లింగాయత్‌లు జనతా పార్టీ వైపు మళ్లారు. తప్పును గ్రహించిన కాంగ్రెస్ లింగాయత్‌వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో 1989ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 1990లో పాటిల్ పక్షవాతానికి గురయ్యారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ప్రముఖ వెనుకబడిన తరగతుల నాయకుడు బంగారప్పను పాటిల్ స్థానంలో నియమించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో దీన్ని కీలక మలుపుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇక లింగాయత్‌ల మద్దతును కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మళ్లడం ప్రారంభించారు.

కర్ణాటక

లింగాయత్‌లను ఆకర్షించడానికి పోటీపడుతున్న బీజేపీ-కాంగ్రెస్

కర్ణాటకలో 1980-90కాలంలో బీజేపీలో యడ్యూరప్ప రాజకీయంగా ఎదుగుతున్నారు. ఈయన లింగాయత్‌‌కావడంతో రాజీవ్ గాంధీ నిర్ణయం నేపథ్యంలో ఆ సమాజిక వర్గం ఏకపక్షంగా యడ్యూరప్పకు, బీజేపీకి మద్దతగా నిలిచింది. అప్పటివరకు బీజేపీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న యడ్యూరప్ప, లింగాయత్‌ల మద్దతుతో 1999నాటికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆ తర్వాత సీఎంగా చేశారు. 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చాక, యడ్యూరప్పను బీజేపీ ముఖ్యమంత్రిగా తొలగించింది. ఈ క్రమంలో లింగాయత్‌లు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఆ సమాజికవర్గాన్ని శాంతింపజేసేందుకు అదే లింగాయత్ వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా ప్రకటించింది బీజేపీ. 2023అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లను ఆకర్షించడానికి బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ వ్యహాలు రచిస్తోంది. ఆ పార్టీలోని లింగాయత్ లను తెరపైకి తెస్తోంది.