Haryana: హర్యానాలో దారుణం.. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ (22) హత్యకు గురయ్యారు.
దుండగులు ఆమెను హత్య చేసి, సూట్కేసులో పెట్టి నిర్మానుష ప్రాంతంలో పడేశారు. శనివారం సప్లా బస్టాండ్ వద్ద సూట్కేసులో ఆమె మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఫోరెన్సిక్ బృందం పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని బయటకు తీసింది.
Details
ఘటనపై పోలీసుల విచారణ
రోహతక్ విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన నార్వాల్ హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు, ప్రాథమిక దర్యాప్తులో ఆమె మెడపై చున్నీ చుట్టి ఉండటాన్ని గమనించారు.
చేతులపై మెహందీ ఉండటంతో ఇది ఇటీవలి హత్యగా అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా చున్నీతో గొంతు బిగించి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పీజీఐఎంఎస్ రోహతక్కు తరలించారు.
కాంగ్రెస్ నేతల స్పందన
హిమానీ నార్వాల్ గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'జోడో యాత్ర'లో చురుగ్గా పాల్గొంది.
ఆమె మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, ఎమ్మెల్యే బిబి బాత్రాతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి.
Details
హర్యానా మాజీ సీఎం భూపిందర్ స్పందన
ఈ దారుణ ఘటనపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంప్లా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ విజేంద్ర సింగ్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
మాజీ సీఎం భూపిందర్ హుడా ఈ హత్యను అనాగరికమైనదిగా, హృదయ విదారకమైందిగా అభివర్ణించారు. హర్యానాలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.
ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.