Page Loader
Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ
గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ

Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు ప్రతిగా పాకిస్థాన్ రెచ్చిపోయి మరింత చర్యలకు తెగబడింది. డ్రోన్లు, యుద్ధవిమానాలను భారత్ వైపు పంపించి భారత భద్రతా వ్యవస్థను పరీక్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే భారత రక్షణ దళాలు అప్రమత్తంగా ఉండటంతో వాటిని వెంటనే కూల్చివేస్తున్నాయి. ఈ క్రమంలో, భారతీయ పౌరులలో భయాందోళనలు కలిగించేందుకు పాక్ అనుకూల శక్తులు మరో యుద్ధం ప్రారంభించాయి. అదే సోషల్ మీడియా ప్రచార యుద్ధం. గుజరాత్‌లోని హజీరా పోర్ట్‌పై దాడి జరిగిందని, జలంధర్‌లో డ్రోన్ దాడి జరిగినట్లు చెబుతూ పాక్ అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో విపరీతమైన నకిలీ వీడియోలు షేర్ అవుతున్నాయి.

Details

ఈ వార్తలపై స్పష్టతనిచ్చిన పీఐబీ  

గుజరాత్ హజీరా పోర్ట్‌పై దాడి జరిగిందన్న వీడియో 2021లో జరిగిన ఒక ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించినదిగా తేలింది. జలంధర్ డ్రోన్ దాడి అంటూ వైరల్ అవుతున్న వీడియోలు నిజానికి ఒక అగ్నిప్రమాదం దృశ్యాలు అని వివరించింది. ఇంతటితో ఆగకుండా, పాక్ ఆర్మీ భారత్‌ పోస్ట్‌పై దాడి చేసిందన్న మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. దీనిపై కూడా పీఐబీ స్పందించింది. ఇది పూర్తిగా అబద్ధపు వీడియో. ఇందులో చూపిస్తున్న '20 రాజ్‌ బెటాలియన్‌' అనే బెటాలియన్‌ భారత సైన్యంలో అసలు లేదని, ఈ వీడియోను కుట్రపూరితంగా తయారుచేశారని పేర్కొంది.

Details

అవాస్తవాలను ప్రజలు నమ్మొద్దు

ప్రజలు ఈ రకమైన అసత్య ప్రచారాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం పాక్ అనుకూల సోషల్ మీడియా యూజర్లు అసత్య ప్రచారాలు మరింత పెంచినట్లు భారత్ గుర్తించింది. అయితే భారత ప్రభుత్వం ఈ వదంతులను తక్షణమే నిర్ధారిస్తూ ప్రతిదీ ఖండిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది.