Page Loader
Bharat Forge: రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన
రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన

Bharat Forge: రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్,రాష్ట్రానికి రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు రాబోతోంది. యుద్ధరంగంలో వినియోగించే ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీలో ప్రసిద్ధిగాంచిన భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ (BFL) తన అనుబంధ సంస్థ కల్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ (KSSL) ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అత్యాధునిక డిఫెన్స్‌ ఎనర్జిటిక్స్‌ ఫెసిలిటీని అందులో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టమ్‌లు, ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌, ఆర్మర్డ్‌ వెహికల్స్‌ అప్‌గ్రేడ్‌, మందుగుండు సామగ్రి, క్షిపణులు, డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌ వంటి విభాగాల్లో పని చేయనున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

భూమి అవసరం 

అంతేకాకుండా, ఆటోమోటివ్‌, విద్యుత్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, నిర్మాణం, మైనింగ్‌, మెరైన్‌, రైల్వే కోచ్‌ల తయారీకి పరికరాలు సరఫరా చేయనుంది. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో అభివృద్ధి చేయబడుతుంది. రూ. 2,400 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రక్షణ సామగ్రిని సరఫరా చేయడమే లక్ష్యంగా ఉంచింది. ఈ ప్రాజెక్టు ద్వారా 550 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనుంది. మొదటిదశలో కనీసం వెయ్యి ఎకరాల భూమి అవసరమని, రెండోదశకు మరో 500 ఎకరాలు కావాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి, ఆర్‌.అనంతపురం గ్రామాల్లో భూమిని పరిశీలించింది. యుద్ధ సామగ్రి తయారీ సామర్థ్యాన్ని పరిశీలించడానికి భూమి అవసరం ఉంటుందని స్పష్టంచేసింది.

వివరాలు 

మొదటిదశలో ప్రతిపాదించిన పనులు 

రక్షణ పరికరాల తయారీ కోసం మొదటిదశలో రూ. 1,000 కోట్లతో ప్లాంట్‌లు ఏర్పాటు చేయనుంది. మందుగుండు షెల్స్‌ నింపడం, ఫిరంగుల తయారీ, రక్షణ రంగానికి అవసరమైన పరికరాల తయారిపై దృష్టి సారించనుంది. షెడ్యూల్‌ ప్రకారం: 2024: వెయ్యి ఎకరాల భూమి సేకరణ, భవిష్యత్తు విస్తరణ కోసం అదనపు భూముల గుర్తింపు 2025: ఏటా 2 లక్షల ఫిరంగుల మందుగుండు నింపే యూనిట్‌ ప్రారంభం; 3,500 టన్నుల TNT తయారీ ప్లాంట్‌ 2026: మాడ్యూలర్‌ ఛార్జ్‌ సిస్టమ్‌ ద్వారా గన్‌ ప్రొపెల్లెంట్ల తయారీ 2027: బాంబులు, రాకెట్ల తయారీకి సంబంధిత పాలిమర్‌ ప్రొపెల్లెంట్లు 2029: అడ్వాన్స్‌డ్‌ ఎనర్జిటిక్స్‌ ఫెసిలిటీలు

వివరాలు 

రెండోదశ

రెండోదశలో రూ. 1,400 కోట్ల పెట్టుబడితో పాలిమర్‌ బాండెడ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంటు, అడ్వాన్స్‌డ్‌ ఎనర్జిటిక్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా మందుగుండు మార్కెట్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు గణనీయమైన ప్రాధాన్యత ఉంటుందని సంస్థ తెలిపింది. 2023లో ప్రపంచ ఆయుధ మార్కెట్‌ డిమాండ్‌ రూ. 1.29 లక్షల కోట్లలో మందుగుండు సామగ్రి వాటా 53% ఉందని పేర్కొంది.