
Delhi bomb scare: దిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. సోమవారం ఉదయం అనేక స్కూళ్లకు వరుసగా ఈమెయిల్ ద్వారా బాంబు హెచ్చరికలు చేరడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,భద్రతా సిబ్బంది డాగ్ స్క్వాడ్లతో స్కూళ్ల పరిసరాల్లో క్షుణ్నంగా తనిఖీలు ప్రారంభించారు. స్కూళ్ల అధికారిక ఈమెయిల్ ఐడీలకు వచ్చిన సందేశాల్లో,బాంబులు పెట్టినట్టు హెచ్చరికలు పంపించారని అధికారులు వెల్లడించారు. ఫలితంగా పాఠశాలల వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. వసంత్ కుంజ్లోని డీపీఎస్ స్కూల్ (DPS),స్ప్రింగ్ డేల్ స్కూల్తో పాటు మరికొన్ని పాఠశాలలకు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని తెలిపారు.
వివరాలు
దర్యాప్తులోకి సైబర్ క్రైమ్ విభాగం
జాగ్రత్త చర్యలలో భాగంగా విద్యార్థులను వెంటనే బయటకు పంపి, బాంబు స్క్వాడ్లతో అన్ని గదులు సోదా చేస్తున్నారు. ఇక ఢిల్లీలో స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదని పోలీసులు గుర్తు చేశారు. గత కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని వెల్లడించారు. డిసెంబర్లో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ స్కూల్కు, అలాగే జూన్ 19న మరో ప్రైవేట్ స్కూల్కు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చినట్టు వివరించారు. ఈ వరుస బెదిరింపుల దృష్ట్యా ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తులోకి దిగిందని అధికారులు స్పష్టం చేశారు. మెయిల్స్ ఎక్కడి నుంచి పంపుతున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని, వీటిలో కొన్నింటి మూలాలు విదేశాల్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెలుగుచూసిందని పోలీసులు పేర్కొన్నారు.