Bomb Threat: గుజరాత్లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా గుజరాత్లోని వడోదర, రాజ్కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. భద్రతా అధికారులు అప్రమత్తమవడంతో ముమ్మరంగా తనిఖీలు జరిగాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో సీఐఎస్ఎఫ్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఇ-మెయిల్స్ వచ్చాయి. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమవడంతో వడోదర, రాజ్కోట్ విమానాశ్రయాల్లో అప్రమత్తత పెరిగింది.
ముమ్మర తనిఖీలు చేపడుతున్న అధికారులు
బాంబుస్క్వాడ్స్, పోలీసులు, ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వడోదర పోలీస్ కమిషనర్ నర్సింహా కమోర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, దేశంలోని ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బెదిరింపులు పంపిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.