Page Loader
Agniveers: అగ్నివీరులకు ఉద్యోగ రిజర్వేషన్లను ప్రకటించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ 
అగ్నివీరులకు ఉద్యోగ రిజర్వేషన్లను ప్రకటించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్

Agniveers: అగ్నివీరులకు ఉద్యోగ రిజర్వేషన్లను ప్రకటించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు చెందిన డీఆర్‌డీఓ,రష్యా మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం కలిసి నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్, అగ్నివీరులకు (Agniveers) రిజర్వేషన్లు అందిస్తున్నది. టెక్నికల్,జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15% ఖాళీలను వీరికి కేటాయించనున్నారు. వివిధ విభాగాలలో వీరిని నియమించుకోవడానికి భాగస్వామ్య సంస్థలు అభ్యర్థించాయి. భద్రతకు సంబంధించిన విభాగంలో కనీసం 50% పోస్టులను అగ్నివీర్‌ల ద్వారా భర్తీ చేయాలనే లక్ష్యంతో బ్రహ్మోస్ సంస్థ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

హరియాణా అగ్నిపథ్‌ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది

"సైనిక, సాంకేతిక, క్రమశిక్షణ విషయంలో అగ్నివీరులు పొందిన శిక్షణ, భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రక్షణ,పారిశ్రామిక రంగాలకు ఎంతో ఉపయోగపడనుంది. 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ కృషి చేస్తున్న సమయంలో, మాలాంటి సంస్థల్లో అగ్నివీరుల సహకారం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది" అని బ్రహ్మోస్ పేర్కొంది. హర్యానాలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆ రాష్ట్రం అగ్నిపథ్‌ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

వివరాలు 

75% అగ్నివీర్‌ల పరిస్థితి పై ప్రశ్నలు

2022లో, మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో 17 నుండి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులు. ఈ పథకం కింద నాలుగు సంవత్సరాల అనంతరం అగ్నివీర్‌లు సర్వీస్‌ నుండి తప్పుకుంటారు. వారికి పెన్షన్ సౌకర్యాలు లభించవు. 25% మందిని తిరిగి సైనిక విధుల్లో కొనసాగిస్తారు. ఈ పథకంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి, మిగతా 75% అగ్నివీర్‌ల పరిస్థితి పై ప్రశ్నలు ఉత్పత్తి అవుతున్నాయి.

వివరాలు 

వారికోసం 10% రిజర్వేషన్

ఇదిలా ఉంటే, కేంద్ర బలగాలు మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. తద్వారా శిక్షణ పొందిన సిబ్బంది తమ బృందంలో చేరుతారని బీఎస్‌ఎఫ్‌ చీఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ చెప్పారు. వారికోసం 10% రిజర్వేషన్ కల్పించనున్నామని అయన తెలిపారు. అలాగే, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తమ పోలీసు బలగాల్లో అగ్నివీర్‌ల కోసం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు, అగ్నిపథ్‌ను సమీక్షించాలనే డిమాండ్ల నేపథ్యంలోని కేంద్రం పథకంలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.