LOADING...
Union Cabinet: ఎన్‌సీడీసీకి రూ.2 వేల కోట్లు కేంద్ర ఆర్థిక సాయం..నాలుగేళ్ల పాటు మద్దతు
ఎన్‌సీడీసీకి రూ.2 వేల కోట్లు కేంద్ర ఆర్థిక సాయం..నాలుగేళ్ల పాటు మద్దతు

Union Cabinet: ఎన్‌సీడీసీకి రూ.2 వేల కోట్లు కేంద్ర ఆర్థిక సాయం..నాలుగేళ్ల పాటు మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ)కు రూ.2,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులను "గ్రాంట్-ఇన్-ఎయిడ్" రూపంలో నాలుగు సంవత్సరాల పాటు కేటాయించనున్నారు. ఈ ఆర్థిక మద్దతు ద్వారా ఎన్‌సీడీసీ మరింతగా రుణాలు పొందగలిగే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా సమాఖ్యల అభివృద్ధికి అవసరమైన నిధులు సులభంగా సమకూరుతాయని అంచనా. ఈ నిర్ణయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

వివరాలు 

 29 కోట్ల మంది సభ్యులకు ఎన్‌సీడీసీ రుణాలు 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.25 లక్షలకుపైగా సహకార సంఘాలు పని చేస్తున్నాయి. వీటిలోని సుమారు 29 కోట్ల మంది సభ్యులకు ఎన్‌సీడీసీ రుణాలు అందజేస్తోంది. ఈ సభ్యుల్లో 94 శాతం మంది రైతులే ఉండడం గమనార్హం. కేంద్రం నుండి లభించే తాజా ఆర్థిక సహాయంతో ఎన్‌సీడీసీ అదనంగా రూ.20 వేల కోట్ల వరకు రుణాలను సమకూర్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌సీడీసీ రుణపునఃప్రాప్తి రేటు ఇప్పటికే 99.8 శాతంగా ఉండటం విశేషం. అంతేకాకుండా, సంస్థ వద్ద ఎలాంటి నాన్‌-పెర్ఫార్మింగ్ ఆసెట్లు (ఎన్‌పీఏ) లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.