Page Loader
Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు
ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు

Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇవాళ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సెక్రెటిరేట్లో ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా రైతు భరోసా పథకంపై చర్చ జరగనుంది. సంక్రాంతికి రైతులకు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటించారు. దీంతో రైతు భరోసా పథకానికి అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. అర్హత గల రైతులను గుర్తించేందుకు కొత్త మార్గదర్శకాలు త్వరలో విడుదల చేసే యోచనలో ఉంది.

Details

అర్హులకే రైతు భరోసా ఇవ్వాలి

గత ప్రభుత్వ కాలంలో రైతు బంధు పథకం కింద పంటలు పండించని భూముల యజమానులకు రూ. 21 వేల కోట్లు అందించిన విషయాన్ని గుర్తించి, ఈసారి నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక, కొండలు, గుట్టలు, రహదారులకు ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను గుర్తించేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం భూమిలేని పేద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూడా పథకాలను ప్రారంభించే యోచనలో ఉంది. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు ఇంటింటి సర్వేలో తెలిసింది. వారిలో 70 లక్షల మంది రైతులు భూ రికార్డులు కలిగి ఉన్నారు, మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు.