
Shashi Tharoor: అవమానాలను మరిచిపోలేం: భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ కొత్త స్వరంపై శశి థరూర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత-అమెరికా సంబంధాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా మాట్లాడటంతో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించడం పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ, ఈ సంబంధాల్లో పరిష్కారం చేయాల్సిన గంభీరమైన అంశాలు ఇంకా మిగిలివున్నాయని ఆయన తెలిపారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తుమంటూనే భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలోఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేమన్నారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయన్నారు. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి అని థరూర్ అభివర్ణించారు.
వివరాలు
భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి
"ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత త్వరగా స్పందించడం ప్రశంసనీయమే. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం. అయితే రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్య వేత్తలు కలిసి పరిష్కరించాల్సిన తీవ్రమైన సమస్యలు ఇంకా ఉన్నాయి. ట్రంప్ ప్రస్తావించిన కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, అందువల్ల అవమానాలను తక్షణమే మర్చిపోలేము. వాటిని అధిగమించాలి" అని అని థరూర్ మాట్లాడారు.