
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం శుభవార్త: రూ. 2,800 కోట్ల నిధుల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త అందించింది.కేంద్రం రూ. 2,800 కోట్ల నిధులను విడుదల చేసింది.
అయితే,ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద విడుదల చేసిందన్నది ఇంకా స్పష్టత లేదు.ప్రాజెక్టు అధికారులు తెలిపిన ప్రకారం,పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కింద రూ.800 కోట్లు,ఇక పనులను ముందుగా చేపట్టేందుకు అడ్వాన్సుగా రూ. 2,000 కోట్లు మంజూరైంది.
2014లో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక,కేంద్రం దశల వారీగా నిధులు విడుదల చేస్తూ వచ్చింది.
తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధుల బిల్లులను పరిశీలించి,వాటిని రీయింబర్స్ చేస్తుంది.
జగన్ ప్రభుత్వం పలు సార్లు అడ్వాన్స్ నిధుల కోసం ప్రయత్నించినా ఫలితం రాలేదు.
అయితే,మోదీ ప్రభుత్వం తొలిసారి అడ్వాన్స్ నిధులను ఇవ్వడానికి అంగీకరించి,సోమవారం ఆ మాట నిలబెట్టింది.
వివరాలు
తాజా డీపీఆర్ ఆమోదం: ప్రాజెక్టుకు మరింత మద్దతు
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోంది. రూ. 30,436 కోట్లతో ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ను కేంద్రం నెల క్రితమే ఆమోదించింది.
దీంతో కేంద్రం నుంచి అదనంగా రూ. 12,157 కోట్లు పొందేందుకు అవకాశం కలిగింది.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషితో ఈ నిధులను అడ్వాన్స్గా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6 వేల కోట్లు, తదుపరి సంవత్సరంలో రూ. 6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే పోలవరం అధికారుల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 7 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు.
వివరాలు
బకాయిలు రూ. 1,615.47 కోట్లు
ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగానూ రూ. 1,615.47 కోట్ల బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.
కానీ గత డీపీఆర్ ప్రకారం, గుత్తేదారులకు చెల్లించిన రూ. 800 కోట్లను మాత్రమే రీయింబర్స్ చేసే అవకాశం ఉంది.
కొత్త డీపీఆర్ ఆమోదం పొందడంతో ఈ నిధులను పొందడానికి మార్గం సులభమైంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద రూ. 800 కోట్లు పొందినట్లు తెలుస్తోంది.
అలాగే, అడ్వాన్సుగా రూ. 2,000 కోట్లు మంజూరు చేసిందని పోలవరం అధికారులు భావిస్తున్నారు.
ప్రాజెక్టు ప్రారంభం నుండి కేంద్రం ఈ విధంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, నిధులు మంజూరు చేయడం ఇదే మొదటిసారి అని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు.