CAA Rules: CAA దరఖాస్తుదారులకు కేంద్రం కొత్త నిబంధనలు.. పాస్పోర్ట్ వివరాలు తప్పనిసరి..
ఈ వార్తాకథనం ఏంటి
భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలులో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. పాకిస్థాన్,ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేస్తున్న వారు తమ వద్ద ఉన్న చెల్లుబాటు అయ్యే లేదా గడువు ముగిసిన పాస్పోర్ట్ల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారులు తమ దేశ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్పోర్ట్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే.. దాని నంబర్,జారీ చేసిన స్థలం,జారీ తేదీ,గడువు తేదీ వంటి పూర్తి వివరాలను CAA దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు
ద్వంద్వ పాస్పోర్ట్లకు అనుమతి లేదు
అలాగే భారత పౌరసత్వం లభించిన 15 రోజులలోపు ఆ పాస్పోర్ట్లను అప్పగించాల్సి ఉంటుంది. కొంతమంది దరఖాస్తుదారులు గడువు ముగిసిన లేదా చెల్లని పాస్పోర్ట్లను కలిగి ఉన్నట్లు గుర్తించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత చట్టాల ప్రకారం ద్వంద్వ పాస్పోర్ట్లకు అనుమతి లేకపోవడంతో ఈ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇప్పటి నుంచి దరఖాస్తుదారులు "తమ వద్ద పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ లేదా బంగ్లాదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే లేదా గడువు ముగిసిన పాస్పోర్ట్లు లేవు" అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మార్పులు ముఖ్యంగా హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందిన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ పౌరులకు వర్తిస్తాయి.
వివరాలు
పాస్పోర్ట్ల విషయంలో పారదర్శకత, చట్టాల అమలు మరింత బలోపేతం
2019లో కేంద్ర ప్రభుత్వం CAA చట్టాన్ని తీసుకురాగా, 2024లో పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసింది. 2014 డిసెంబర్ 31కు ముందు భారత్కు వలస వచ్చిన ఆరు మైనారిటీ వర్గాలకు వేగవంతమైన పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. తాజా నోటిఫికేషన్తో పాస్పోర్ట్ల విషయంలో పారదర్శకత, చట్టాల అమలును మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది.