Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఊరట కలిగించింది. ఈ మేరకు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమన్న ఏజీ వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయకూడదని ఆదేశాలిచ్చింది.
గత విచారణలో భాగంగా 7వ తేదీ వరకు నో అరెస్ట్ : హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని, ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. గత విచారణ సందర్భంగా 7వ తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు విచారణకు పూర్తిగా సహకరిస్తారని గత విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్ పైనా హైకోర్టు నేటి వరకు స్టే ఇచ్చింది. ఆయా కేసుల విచారణ అనంతరం అరెస్ట్ చేయకూడదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.