
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తోంది.
ఇప్పటికే 'సూపర్ సిక్స్' హామీలలో రెండు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, మిగిలిన హామీల అమలుకు సైతం సిద్ధమవుతోంది.
తాజాగా మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో ముఖ్య ప్రకటన చేశారు.
'సూపర్ సిక్స్'లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.
ఈ హామీని ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించింది. ఆ హామీ అమలు దిశగా కసరత్తు పూర్తయ్యిందని సీఎం స్పష్టం చేశారు.
Details
సంపద సృష్టించి ఆదాయాన్ని పెంపొందించాలి
ఈ పథకం అమలులో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న విధానాలను ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేసింది.
ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, ఆయా రాష్ట్రాల్లో పర్యటింపజేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి అక్కడి అమలులోని తీరును పరిశీలించారు.
ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాం. సంపదను సృష్టించి, ఆదాయాన్ని శ్రమించే వారికి మళ్లించాలి.
ఇదే ప్రజల సాధికారతకు దోహదపడే మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు.
Details
ప్రభుత్వంపై రూ.3,182 కోట్ల భారం
ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.3,182 కోట్లు ఏటా భారం పడనుంది. ప్రయాణ సమయంలో మహిళలకు జీరో టికెట్ ఇవ్వనున్నారు.
టికెట్పై ధర కనిపించదు కానీ, ఈ-పోస్ యంత్రాల్లో మాత్రం టికెట్ విలువ నమోదవుతుంది. ఆ లెక్కల ఆధారంగా ప్రతి నెల ఆర్టీసీ ప్రభుత్వానికి బిల్లులు పంపిస్తుంది.
ప్రభుత్వం వాటిని రీయింబర్స్ చేస్తుంది. అయితే, ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందా, లేదా జిల్లా పరిమితిలో పరిమితం అవుతుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
దీనిపై ప్రభుత్వ ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదివరకే జూన్ 12 నుంచి 'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ' పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.