TTD : బోనులోకి చిరుత.. తిరుమల-అలిపిరి బాటలో చిక్కిన చీతా
తిరుమల తిరుపతిలో ఎట్టకేలకు చిరుతపులి బోనులోకి చిక్కింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)తో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది. శుక్రవారం ఆరేళ్ల బాలికను చంపిన చిరుత కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలించారు.దాన్ని బంధించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేశారు. ఘటనా స్థలంతో పాటు మరో 3 ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచారు. దీంతో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలో వెళ్తున్న ఆరేళ్ల బాలికను చిరుత పొట్టనపెట్టుకోవడం శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం సృష్టించింది.
చిరుత దొరకడంతో భయాందోళనకు తెర
నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలినడక బాటలో స్వామి వారి సన్నిధికి వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా చిరుతపులి బాలికపై దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే కాస్త ముందే నడుస్తోన్న బాలికపై పడ్డ చిరుత, రాత్రి వేళ ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. శనివారం ఉదయం బాలిక మృతదేహాన్ని అటవీ శాఖ గుర్తించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెట్లమార్గంలో చిన్నారులను అనుమతించకూడదని నిర్ణయించారు. 100 మంది భక్తుల చొప్పున ఓ బృందంగా ఏర్పడ్డాకే కాలినడకను అనుమతించాలని తేల్చారు. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో టీటీడీ, అటవీశాఖ ఊపిరి పీల్చుకుంటున్నాయి.చిరుత దొరికే వరకు భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిక్కిన చిరుతను దూరంగా దట్టమైన అడవీలో విడిచిపెట్టనున్నారు.