News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు
దిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు చేపట్టడం కలకలం రేపింది. ప్రముఖ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' కు చైనాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కారణంగా ఆ సంస్థ కార్యాలయం, అందులో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేశారు. దాదాపుగా 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే ఉద్యోగుల వద్ద ఉన్న ల్యాప్ ట్యాప్లు, మొబైల్ ఫోన్లను సిబ్బంది స్వాధనం చేసుకున్నారు. అయితే సదరు ఉద్యోగులను విచారణలో పాల్గొనాల్సిందిగా వారికి సమన్లు కూడా జారీ చేసినట్లు సమాచారం. న్యూస్ క్లిక్ సంస్థ చైనాకు అనుకూలంగా స్పాన్సర్డ్ వార్తలను నడుపుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
పీఎమ్ఎల్ఏ కేసులో న్యూస్ క్లిక్ను విచారిస్తున్న ఈడీ
దిల్లీ పోలీసులు తన ఇంటికొచ్చి, ల్యాప్ టాప్ను ఎత్తుకెళ్లారని న్యూస్ క్లిక్ జర్నలిస్టులో ఒకరైన అభిసార్ శర్మ పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ) కేసులో న్యూస్ క్లిక్ ను ఈడీ విచారిస్తోంది. న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ.38.05 కోట్ల మేర విదేశీ నిధుల మోసానికి పాల్పడిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి నేవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్ వర్క్ లో ఈ సంస్థ భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.