2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2024ఎన్నికల్లో తాను హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం హాజీపూర్ ఎంపీగా చిరాగ్ బాబాయ్, కేంద్రమంత్రి పశుపతి కుమార్ పారస్ ఉన్నారు. తాను తిరిగి ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్లు చిరాగ్ సోమవారం ప్రకటించారు. ఇది జరిగిన ఒకరోజు తర్వాత హాజీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తాననడం గమనార్హం. ఎన్డీఏలోకి తిరిగి రావడంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయని చిరాగ్ చెప్పారు. స్నేహపూర్వక ఒప్పందం కారణంగానే తాను ఎన్డీఏలోకి తిరిగి చెరినట్లు చెప్పారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, 2025 బిహార్ ఎన్నికలే లక్ష్యంగా తాము పని చేస్తామని స్పష్టం చేశారు.
రామ్ విలాస్ మరణంతో రెండుగా చీలిన లోక్ జనశక్తి పార్టీ
లోక్ జనశక్తి వ్యవస్థాపకుడు రామ్ విలాస్ మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే. రామ్ విలాస్ మరణం తర్వాత ఆయన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ తన వర్గంతో కలిసి ఎన్డీఏలో చేరారు. అనంతరం ఆయన కేంద్రమంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఒక వర్గానికి రామ్ విలాస్ కుమారుడు చిరాగ్ నాయకత్వం వహిస్తుండగా, మరో వర్గానికి పశుపతి నాయకుడిగా ఉన్నారు. అప్పటి నుంచి ఇరు వర్గాలు మధ్య వివాదాలు కొసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ విలాస్కు కంచుకోటగా ఉన్న హాజీపూర్ నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేసేందుకు పరాస్, చిరాగ్ ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రయత్నించినా, అది ఫలించలేదు.