Chandrababu: సీఎం చంద్రబాబుతో, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు,పరిశ్రమలను ఆకర్షించడంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ శుక్రవారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని సీఐఐ బృందం ముఖ్యమంత్రితో సమావేశమై ఏపీ నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. కాగా, అమరావతితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక, విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.