Page Loader
సుప్రీంకోర్టును వదలని సైబర్ నేరగాళ్లు..నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరిక
అప్రమత్తంగా ఉండాలని సీజేఐ డివై చంద్రచూడ్ హెచ్చరిక

సుప్రీంకోర్టును వదలని సైబర్ నేరగాళ్లు..నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరిక

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 31, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు పేరుతో రూపొందిన ఫేక్ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ డివై చంద్రచూడ్ హెచ్చరించారు. ఆ వెబ్‌సైట్‌ లింక్‌లను క్లిక్‌ చేయొద్దని ఆయన సూచించారు. సైబర్‌ నేరగాళ్ల మోసాలకు నియంత్రణ లేకుండా పోతోందన్నారు. ఇప్పటి వరకు కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు, బ్రాండ్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించారన్నారు. కానీ ఈసారి ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే లక్ష్యంగా చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్న ఈ సైబర్ నేరగాళ్లు న్యాయస్థానాన్ని వదలట్లేదని మండిపడ్డారు. ఫేక్ వెబ్‌సైట్‌ విషయంలో లాయర్లు, కక్షిదారులు మరింత అలెర్ట్ అవ్వాలని సీజేఐ సూచనలు చేశారు. ఈ మేరకు దీనిపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సైతం పబ్లిక్‌ నోటీసులు జారీ చేసింది.

details

సుప్రీంకోర్టు ఓరిజినల్ వెబ్‌సైట్‌ ఇదే  

సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు.ఈ క్రమంలోనే రెండు URLలను కూడా పుట్టించారు. వీటితో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ మేరకు స్పందించిన సీజేఐ ఆయా లింకులను ఎవరూ క్లిక్ చేయవద్దని కోరారు. దీంతో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారం, ఆర్థిక లావాదేవీల గురించి సుప్రీం ఆరా తీయదని రిజిస్ట్రీ నోటీసులో పేర్కొన్నారు. సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా www.sci.gov.in డొమైన్‌తో రిజిస్టర్‌ అయిన ఫేక్ వెబ్‌సైట్‌ పేరిట URL వస్తే దాన్ని క్లిక్‌ చేసే ముందు ఒరిజినల్‌ డొమైన్‌తో సరి చూసుకోవాలన్నారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని కోర్టు స్పష్టం చేసింది.