
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. 10మంది గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
హిమాలయ ప్రాంత రాష్ట్రాలు వరుసగా కుంభవృష్టులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డెహ్రాడూన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగి నాలుగు రోజులు కూడా గడవకముందే, ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మరో ఘోర విపత్తు సంభవించింది. నందానగర్లో కురిసిన కుంభవృష్టితో ఆరు భవనాలు పూర్తిగా కూలిపోయాయి. ఈ ఘటనలో 10మంది ఆచూకీ దొరకకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, సెప్టెంబర్ 20 వరకు డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల తీవ్రతతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
ముస్సోరీలో ఇరుక్కుపోయిన 2,500 మంది పర్యాటకులు
భారీ వర్షాల కారణంగా కొండచరియలు కూలిపోవడంతో, డెహ్రాడూన్ నుండి ముస్సోరీకి వెళ్లే ప్రధాన రహదారి వరుసగా రెండవ రోజు కూడా మూతపడింది. దాంతో సుమారు 2,500 మంది పర్యాటకులు ముస్సోరీలో ఇరుక్కుపోయారు.ఈ విపత్తులో పదికి పైగా రహదారులు, వంతెనలు దెబ్బతినగా, వాటిలో ఐదు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. పర్యాటకులు సురక్షితంగా ఉండేందుకు తమ బస ప్రాంతాల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, 'ముస్సోరీ హోటల్ యజమానుల సంఘం' మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి, ఇరుక్కుపోయిన పర్యాటకులకు ఒక రాత్రి పాటు ఉచిత వసతి కల్పించనున్నట్లు ప్రకటించింది.
వివరాలు
దాదాపు వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించిన సహాయక బృందాలు
ఈ విపత్తుపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. "దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను మరమ్మతు చేయడం, రహదారి, విద్యుత్ కనెక్టివిటీని త్వరగా పునరుద్ధరించడం మా ప్రాధాన్యత" అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 85 శాతం విద్యుత్ లైన్లను పునరుద్ధరించామని, మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. సహాయక బృందాలు ఇప్పటివరకు దాదాపు వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించాయని ఆయన వివరించారు. డెహ్రాడూన్-ముస్సోరీ మార్గంలో రాకపోకలు సజావుగా సాగేందుకు, కొల్హుఖేత్ వద్ద సైన్యం తాత్కాలిక బైలీ వంతెన నిర్మాణ పనులు చేపడుతోంది.
వివరాలు
హిమాచల్ ప్రదేశ్లోనూ వరదలకు ముగ్గురి బలి
ఇక హిమాచల్ ప్రదేశ్లో కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఈ వారం కురిసిన వర్షాల వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాల ఉద్ధృతితో రాష్ట్రంలో 1,500 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని అధికారులు వెల్లడించారు. మొత్తం నష్టం దాదాపు రూ. 4,582 కోట్లకు చేరిందని అంచనా వేశారు. ఇళ్లను కోల్పోయిన బాధితులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ కింద పట్టణాల్లో రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5,000 చొప్పున అద్దె సాయం అందిస్తున్నట్లు హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.