Page Loader
RN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్.. 
'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్..

RN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు చేశారు. శీతాకాల అసెంబ్లీసమావేశాల ప్రారంభ రోజున సంప్రదాయ ప్రకారం సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్నా,ఆయన దాన్ని నిరాకరించి వెళ్లిపోయారు. రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సాధారణంగా సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం"తమిళ్ థాయ్ వాల్తు"ను ఆలపించడంతో పాటు సభ ముగిసినప్పుడు జాతీయ గీతం పాడుతారు. అయితే గవర్నర్ రవి ఈ నిబంధనలో మార్పు చేయాలని,సభ ప్రారంభంలోనే జాతీయ గీతం ఆలపించాలని కోరారు. సభా నాయకుడు ముఖ్యమంత్రి స్టాలిన్,స్పీకర్ ఎం అప్పావు ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతో గవర్నర్ సభ నుంచి నిష్క్రమించారు. అనంతరం గవర్నర్‌ చదవాల్సిన సంప్రదాయ ప్రసంగాన్ని స్పీకర్ ఎం అప్పావు చదివి వినిపించారు.

వివరాలు 

గవర్నర్‌ విజ్ఞప్తిని తిరస్కరణ 

ఈ ఘటనపై రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీలో భారత రాజ్యాంగం, జాతీయ గీతాన్ని అవమానించినట్లు పేర్కొంది. "జాతీయ గీతాన్ని గౌరవించడం భారత రాజ్యాంగంలో మొదటి ప్రాథమిక విధి. రాష్ట్రాల శాసనసభల ప్రారంభం, ముగింపులో జాతీయ గీతం పాడటం సాధారణ ఆచారం. అయితే తమిళనాడు అసెంబ్లీ ప్రారంభంలో తమిళ గీతాన్ని మాత్రమే పాడారు. గవర్నర్‌ జాతీయ గీతం ఆలపించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ కారణంగా గవర్నర్ రాజ్యాంగ విలువలను, జాతీయతను అగౌరవపరిచిన పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆందోళన చెందారు" అని ప్రకటనలో పేర్కొన్నారు.

వివరాలు 

'ద్రావిడియన్ మోడల్' పదం చదవడానికి నిరాకరించి..

గత సంవత్సరం ఫిబ్రవరిలో కూడా గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రసంగం ప్రతిలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై పేర్లు, 'ద్రావిడియన్ మోడల్' అనే పదం, శాంతిభద్రతల అంశాలకు సంబంధించిన భాగాలను ఆయన చదవడానికి నిరాకరించి సభ విడిచి వెళ్లిపోయారు.