
CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే?
ఈ వార్తాకథనం ఏంటి
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించడంలో తడబడుతున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఆయన అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలను కలిసి మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది.
అధిష్టాన సూచనల మేరకే ఆయన ఢిల్లీకి వెళ్లారని భావిస్తున్నారు.
సాధారణంగా మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే శాఖల కేటాయింపు గవర్నర్ గెజిట్ ద్వారా ప్రకటిస్తారు. కానీ ఈసారి ఆ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది.
దీనికి ముఖ్య కారణంగా కాంగ్రెస్ హైకమాండ్ శాఖల కేటాయింపుపై నేరుగా జోక్యం చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Details
హోంశాఖను ఆశిస్తున్న కీలక నేతలు
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోం, మున్సిపల్, విద్య, సామాజిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సేవలు, కమర్షియల్ టాక్స్, న్యాయ శాఖలున్నాయి.
వీటిలో కొన్ని శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు సీఎం తన ప్రతిపాదనలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే మంత్రులుగా సేవలందిస్తున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ వంటి నేతలు హోంశాఖను ఆశించడంతో, కీలక శాఖల కేటాయింపుపై సవాళ్లను అధిష్టానం ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Details
ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న హైకమాండ్
మున్సిపల్ శాఖపై కూడా పలువురు మంత్రులు ఆసక్తిని వ్యక్తం చేశారట.
ఈ శాఖల కేటాయింపులో పాత మంత్రుల అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు హైకమాండ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది.
ఈ సమతుల్యతకు కృషి చేసేందుకు రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.