Jharkhand: జార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జార్ఖండ్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ) నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) పరీక్షను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో ప్రధాన డిమాండ్లలో సీజీఎల్ పరీక్ష రద్దు కూడా ఒకటని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. అలాగే పొరుగు సేవల ప్రాతిపదికన టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (టీడీపీఎల్) 2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన అన్ని పరీక్షలు, వాటి ఫలితాలను కూడా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు.
వివరాలు
సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ
పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సోరెన్ చెప్పారు.
నియామక పరీక్షల్లో అక్రమ పద్ధతులను అడ్డుకునేందుకు ఇప్పటికే చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
జేఎస్ఎస్సీ పరీక్షల వ్యవహారంపై సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్నాయని సీఎం వెల్లడించారు.
దర్యాప్తులో అనేక విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని బయటపెట్టలేమని చెప్పారు.
పరీక్షల కుంభకోణంలో పలు కంపెనీల ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
ఆందోళన విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి
విద్యార్థులు ప్రధానంగా లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినందున ఇక ఆందోళన విరమించాలని ఝార్ఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
పరీక్ష రద్దు నిర్ణయంపై అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని మంత్రి సుదివ్య కుమార్ తెలిపారు.
అయితే సీజీఎల్ పరీక్ష ద్వారా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
వివరాలు
ఆందోళన విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి
సోమవారం రాత్రి ఝార్ఖండ్ సచివాలయం ఎదుట వారు నిరసన చేపట్టారు.
పరీక్షను రద్దు చేస్తే దాదాపు 2,000 మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సీబీఐతో విచారణ జరిపించాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని 'జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్' స్పష్టం చేసింది.
16 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న దేవేంద్ర మహతో మాత్రం తాను త్వరలోనే దీక్ష విరమిస్తానని ప్రకటించారు.