తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. అంజూ యాదవ్పై ఎస్పీకి ఫిర్యాదు
జనసేన నాయకుడు సాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై తిరుపతి జిల్లా ఎస్పీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం తిరుపతికి చేరుకున్న పవన్, కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఐ అంజూయాదవ్పై జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డికి పవన్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె దురుసు ప్రవర్తనపై ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు సాయి కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తన పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే తనపై చేసినట్లేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడికి నుంచి తిరుపతికి వచ్చారు.
జనసేన నాయకుడిపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్
ఇటీవల జనసేన కార్యకర్త కొట్టే సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్పై తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పవన్ కల్యాణ్ పై వాలంటీర్లు చేస్తున్న నిరసనకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో జనసేన నేతలు ఆందోళనలు చేయగా.. పోలీస్ స్టేషన్ అవరణంలో ఉన్న సీఐ అంజూయాదవ్, జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పవన్ తిరుపతికి చేరుకొని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.