No confidence motion: లోక్సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్
మణిపూర్లో హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు బుధవారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు సమర్పించాయి. కాంగ్రెస్ తరఫున ఎంపీ గౌరవ్ గొగోయ్, తెలంగాణ సీఎం కేసీఆర్కు చెందిన బీఆర్ఎస్ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానంలో సంఖ్యా పరీక్షలో విఫలమైనప్పటికీ, చర్చ సందర్భంగా మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా తాము విజయం సాధిస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మణిపూర్ పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెబుతారని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కీలకమైన అంశంపై పార్లమెంటులో ప్రధాని మాట్లాడేలా చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి.