Page Loader
Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి 
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి

Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి 

వ్రాసిన వారు Stalin
Jun 29, 2024
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్‌ కండువా సొంత గూటికి చేరిపోయారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌ పనిచేశారు.

వివరాలు 

కాంగ్రెస్‌ కు వీరవిధేయుడు 

1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్‌..నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు.1989లో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి డీఎస్, తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. డీఎస్.. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన డీఎస్ సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దివంగత వైఎస్ఆర్ కలిసి ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్ అధికారానికి రావడానికి కృషి చేశారు.జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించారు.

వివరాలు 

రాజకీయ పదవులు 

2013 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఎమ్మెల్సీగా రెండోసారి కూడా రాకపోవడంతో అసంతృప్తితో 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. సలహాదారు పాత్ర నిర్వహించారు. అంతర్రాష్ట్ర వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. 2016 నుండి 2022 వరకు రాజ్యసభలో BRS ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాజ్యసభ పదవీకాలంలో BRSతో విభేదాలు వచ్చాయి . దీంతో ఆయన మాతృ సంస్ధలోకి వచ్చారు.

వివరాలు 

తండ్రితో అర్వింద్ గత స్మృతులు 

తండ్రి మృతి పట్ల డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. "అన్నా..అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY ! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు,ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు." అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

వివరాలు 

పలువురి సంతాపాలు 

డీఎస్ మరణవార్త తెలియడంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు.

వివరాలు 

కాంగ్రెస్ కు నిజమైన కార్యకర్త:  భట్టి 

డి శ్రీనివాస్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జి .కిషన్ రెడ్డి, తదితరులు సంతాపం తెలిపిన వారిలో వున్నారు. కాంగ్రెస్ కు నిజమైన కార్యకర్తగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అభివర్ణించారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ఎన్నో పదవులు అలరించారని ఆయన కొనియాడారు. ఢిల్లీ నుంచి ధర్మపురి అర్వింద్ రాగానే ఆయన మృతదేహాన్ని నిజామాబాద్ లోని ఆయన సొంతవూరికి తరలిస్తారు. ప్రస్తుంతం బంజారా హిల్స్ ఎంఎల్ ఎ కాలనీలో ఆయన పార్ధీవ దేహాన్ని వుంచారు. పలువురు ప్రముఖుల సందర్శనార్ధం ఉంచనున్నారు.