Wine shops: దరఖాస్తుల గడువు పొడిగింపు వివాదం.. వైన్ షాపుల డ్రాకు లైన్ క్లియర్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ హైకోర్టులో లిక్కర్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ కేసుపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. కోర్టు, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా తుది తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టంగా తెలిపింది.ఇరుపక్షాలు సోమవారానికి రాతపూర్వక వాదనలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ వాదించిన దరఖాస్తుల గడువు పొడిగింపు,షాపుల డ్రా నిర్వహణపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 27న మద్యం షాపుల డ్రాకు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్లోని డి. వెంకటేశ్వరరావు, మరో నలుగురు, మద్యం షాపుల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 18నుంచి 23వరకు పొడిగించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Details
గడువు పొడగించే అధికారం ప్రభుత్వానికే ఉంది
ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్. తుకారాంజీ శనివారం విచారణ నిర్వహించారు. ప్రభుత్వ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ, గడువు పొడిగించే అధికారం ప్రభుత్వం వద్ద ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్ష పరిమితమని, దురుద్దేశం లేదా పక్షపాతం ఉన్న సందర్భంలోనే జోక్యం చేసుకోవచ్చని తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ, వారు నిబంధనలు మార్చమని కోరడం లేదని, ఉన్న నిబంధనలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం మాత్రమే చర్యలు చేపట్టాలని, దరఖాస్తుల స్వీకరణ గడువు నిర్దేశించిన తరువాత దాన్ని మార్చే అధికారం లేదని అభ్యర్థించారు.