దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్
గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, బుధవారం మళ్లీ పెరిగాయి. దేశంలో 24గంటల్లో 10,542 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,562కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో 8,175 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,42,50,649కి చేరుకుంది. రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది.
రాబోయే నాలుగు వారాలు చాలా కీలకం: నిపుణులు
రోజువారీ పాజిటివిటీ రేటు బుధవారం 4.39 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5.14శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు అందించబడ్డాయి. ఇప్పటి వరకు 92.46 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం పేర్కొంది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ XBB1.16వ్యాప్తి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది. రాబోయే నాలుగు వారాలు చాలా కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని, అయితే భయాందోళనలకు గురిచేసే పరిస్థితి లేదని దిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.