Page Loader
సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; 1,050 మెగావాట్ల థర్మల్, 250 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఆమోదం

సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాబోయే రోజుల్లో 1,050మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణి కంపెనీ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపాదిత థర్మల్‌ పవర్‌ ప్లాంట్లతో కలిసి కంపెనీ విద్యుత్ సామర్థ్యం 3,350 మెగావాట్లకు చేరుకుంటుందని శ్రీధర్‌ వెల్లడించారు. నెల రోజుల్లోగా ప్రతిపాదిత పవర్‌ ప్లాంట్లకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జైపూర్‌లో దాదాపు 2వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన 1,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాంగణంలో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు.

సింగరేణి

భూపాలపల్లి, మందమర్రి, మణుగూరంలో సోలార్ ప్లాంట్లు

800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని శ్రీధర్‌ తెలిపారు. ఈ ప్లాంట్‌ పూర్తయితే సింగరేణి థర్మల్‌ పవర్‌ 2000 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం సింగరేణి నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా సంస్థకు ఏటా దాదాపు రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు వివరించారు. తద్వారా సంస్థ ప్రగతికి దోహదపడుతుందన్నారు. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరు గని ప్రాంతంలో 250 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సింగరేణి సంస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్ 550 మెగావాట్లు అవుతుందని తెలిపారు.