
Cyber attack: మయన్మార్ భూకంప సహాయ కార్యక్రమంలో పాల్గొన్న భారత వైమానిక దళ విమానంపై సైబర్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ఎయిర్ఫోర్స్(IAF)కు చెందిన విమానాలు మయన్మార్లో జరిగిన భూకంప సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో సైబర్ దాడికి గురయ్యాయి.
రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం,మయన్మార్ వైపు ప్రయాణిస్తున్నసీ-130 జే (C-130J) రకం వైమానిక దళ విమానంపై GPS-స్పూఫింగ్ అనే సైబర్ అటాక్ జరిగింది.
ఇటీవల మయన్మార్లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది.ఈ విపత్తులో చిక్కుకున్న ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం "ఆపరేషన్ బ్రహ్మ" పేరిట సహాయక చర్యలను ప్రారంభించింది.
ఈ ఆపరేషన్లో భాగంగా,భారత వైమానిక దళం ద్వారా భూకంప బాధితులకు అవసరమైన సహాయ సామాగ్రి, రక్షణ సిబ్బంది మయన్మార్కు పంపించబడింది.
ఈ సహాయ కార్యక్రమం నిర్వహణలో ఉన్న సమయంలోనే పై విమానం GPS ఆధారిత స్పూఫింగ్ దాడికి గురైంది.
వివరాలు
ఉపగ్రహ సమాచారాన్ని దొంగ సిగ్నల్స్తో మార్చి వేసి..
GPS స్పూఫింగ్ అనే దాడి పద్ధతిలో విమానం లేదా వాహనం నావిగేషన్ వ్యవస్థను తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో నకిలీ కోఆర్డినేట్లు పంపబడతాయి.
ఇది అసలు ఉపగ్రహ సమాచారాన్ని దొంగ సిగ్నల్స్తో మార్చి వేసి,విమానాన్ని తప్పు దిశలో తరలించే ప్రమాదాన్ని కలిగిస్తుంది.
అయితే,ఈ ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొన్న ఐఏఎఫ్ పైలట్లు తక్షణమే ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్ (INS) ను అమలు చేయడంతో, విమాన నావిగేషన్ను సురక్షితంగా నియంత్రించగలిగారు అని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.
వివరాలు
అమృత్సర్, జమ్మూ పరిసర ప్రాంతాల్లో465 GPS స్పూఫింగ్ కేసులు
GPS స్పూఫింగ్ దాడులు సాధారణంగా డేటాను అపహరించడమే కాదు,నకిలీ సమాచారంతో వాస్తవ సమాచారాన్ని మిస్లీడ్ చేయడం ద్వారా విమానాలను లేదా ఇతర వాహనాలను గందరగోళానికి గురిచేస్తాయి.
ఇలాంటి సంఘటనలు అంతర్జాతీయంగా పలు ప్రదేశాల్లో నమోదయ్యాయి.
గతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, అలాగే ఇరాన్ పరిధిలోనూ ఇటువంటి GPS స్పూఫింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.
2023 నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకూ అమృత్సర్, జమ్మూ పరిసర ప్రాంతాల్లో మాత్రమే 465 GPS స్పూఫింగ్ కేసులు నమోదయ్యాయని సమాచారం.