TS Elections: తెలంగాణలో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణయం : జనసేన
తెలంగాణ ఎన్నికల (TS Elections) హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇక బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థులపై కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీపై మరో రెండు, మూడ్రోజుల్లో నిర్ణయాన్ని తీసుకుంటామని జనసేన (Janasena) స్పష్టం చేసింది. హైదరాబాద్లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ దృష్టికి తెలంగాణ జనసేన నాయకులు తీసుకెళ్లారు.
జనసేన నాయకుల అభిప్రాయాలను గౌరవిస్తానన్న పవన్
ఈసారి పోటీని విరమించుకుంటే ప్రజల ముందు భవిష్యత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ నేతల అభిప్రాయాల విన్న పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో తాను పరిస్థితులను అర్థం చేసుకోగలని, తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, జనసైనికుల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి రెండ్రోజులు సమయం అవసరమని పవన్ తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ శాఖ ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి, రాజలింగం, ఎం.దామోదర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.