
Delhi elections: మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్యెల్యే దినేష్ మొహానియా.. కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ ఘటనలో ఆయన సదరు మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, పోలీసుల ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు తెలియజేశారు. అయితే, ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా, ప్రజలను ఆప్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
వివరాలు
తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు
అయితే,ప్రచార ర్యాలీ సందర్భంగా ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు అభ్యంతరకరంగా సైగలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో,అసహనానికి గురైన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించారు.దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో,ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీంతో,నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు,దినేష్ మోహానియా సంగం విహార్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన మళ్లీ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.అయితే,వివాదాలు దినేష్ మోహానియాకు కొత్తవేమీ కావు. గతేడాది కూడా ఆయన తన నియోజకవర్గంలో రోడ్డు పక్కన పండ్లు అమ్ముతున్న వ్యాపారితో దురుసుగా ప్రవర్తించడంతో,అప్పట్లోనూ ఆయనపై కేసు నమోదైంది.