
Palla Rajeshwar Reddy: కేసీఆర్ ఫామ్హౌస్లో అపశృతి.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి తీవ్ర గాయం!
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది. ఈ క్రమంలో ఆయనను కలవడానికి ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తూ జారి పడ్డారు. ఈ ఘటనలో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్టు సమాచారం. వెంటనే ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు.
Details
ఇవాళ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈరోజు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో విచారణకు హాజరుకాబోతున్నారు. కేసీఆర్కు మద్దతుగా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉదయం నుంచే ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకుంటున్నారు. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫామ్హౌస్ చేరుకున్న తర్వాత జారిపడి గాయపడినట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ఈ సంఘటన పార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.