Cruise Missile: డీఆర్డీఓ మరో ఘనత.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని డీఆర్డీఓ (DRDO) సొంతం చేసుకుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM)ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ఫ్లైట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్కు చెందిన అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా క్షిపణి ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు తెలిపింది. ఈ విజయంతో సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే భారత సామర్థ్యం మరింత బలోపేతమైందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
డీఆర్డీఓ బృందాన్ని అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఈ కీలక ప్రయోగాన్ని రక్షణ కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్తో పాటు భారత నౌకాదళం, వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమ భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిలో ఉపయోగించిన అన్ని కీలక ఉపవ్యవస్థలను డీఆర్డీఓ ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో దేశీయంగానే రూపొందించడం విశేషం. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) ఈ ప్రాజెక్టుకు నోడల్ ల్యాబ్గా వ్యవహరించింది.
వివరాలు
డీఆర్డీఓ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్,యాంటీ-షిప్ క్షిపణులు విజయవంతం
స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించే 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి ఈ విజయం మరో కీలక ముందడుగుగా రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రెండు రోజుల క్రితమే డీఆర్డీఓ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థతో పాటు యాంటీ-షిప్ క్షిపణులను కూడా వరుసగా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. తాజా విజయంతో భారత రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.