Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ సమీపంలో అయోధ్య గ్రామంలో ఉన్న చెరువు కట్ట తెగిపోవడంతో, రైలు రవాణాకు ఇబ్బందిగా మారింది. విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మరోవైపు మహబూబాబాద్ శివారులో రైలుపట్టాలపై వరదనీరు ప్రవహిస్తూ, ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకరలు కొట్టుకుపోయాయి.
నాలుగు గంటల పాటు నిలిచిపోయిన మహబూబ్నగర్-విశాఖ ఎక్స్ప్రెస్
ఇటువంటి పరిస్థితుల్లో, మచిలీపట్నం, సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేయాల్సి వచ్చింది. తాళ్లపూసలపల్లి వద్ద కూడా రైల్వే ట్రాక్ను వరద నీరు తాకడంతో, పందిళ్లపల్లి వద్ద మహబూబ్నగర్-విశాఖ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు 4 గంటలపాటు నిలిచిపోయింది. వర్షాల ధాటికి రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.